త్యాగమూర్తి ప్రవక్త ఇబ్రాహీమ్‌

page -7

దేవునిపై భారం వేసిన హాజిరాకు విశ్వ ప్రభువు సహనాన్ని, ధైర్యాన్ని ప్రసాదిం చాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వారి వద్ద ఉన్న ఆహారం, నీరు అయిపోయాయి. పసి బిడ్డతో సహా ఆమె ఆకలిదప్పులతో అలమటించసాగారు. బిడ్డకు పాలు పట్టడానికి ఆమె రొమ్ముల్లో పాలు కూడా రావడం లేదు. పసిబిడ్డ ఆకలితో దయనీయంగా ఏడుస్తున్నాడు. హాజిరా కన్నీరుమున్నీరయ్యింది. బిడ్డను అక్కడే నేల మీద వదలి నీటి కోసం, ఆహారం కోసం వెతుకాడుతూ తిరగ సాగారు. ఒక కొండను ఎక్కారు (ఈ కొండనే తర్వాత సఫా కొండగా పిలుస్తు న్నారు). ఆ కొండపై నుంచి ఆ లోయల మొత్తాన్ని పరిశీలించి చూశారు. మరో వైపున ఇంకో కొండ కనబడింది (దీనిని తర్వాత మర్వా కొండగా పిలుస్తున్నారు).

  • ఖురాన్ కథా మాలిక

ఇబ్రాహీమ్‌ (అ) దుఃఖం

తన కుటుంబాన్ని మదలి ఒక్కో అడుగు దూరంగా వెళుతున్న కొద్దీ ఇబ్రాహీమ్‌ (అ)కు దుఃఖం అతిశయించసాగింది. ముసలి వయసులో తనకు అల్లాహ్‌ ప్రసాదించిన ఏకైక కుమారుడిని అక్కడ వదలి వెళుతున్న ఆలోచన కూడా భరించ రానిదిగా ఉందాయనకు. అయితే విశ్వ ప్రభువు పట్ల దృఢమైన తన నిబద్ధతను నిరూపించుకునే పరీక్షల్లో ఇదొకటని ఆయన గుర్తించారు. ఆయన అల్లాహ్‌ను ప్రార్థిస్తూ, ”ఓ ప్రభూ! నీ పవిత్రమైన గృహానికి దగ్గరగా నిర్జన ప్రదేశంలో నేను నా కుటుంబీకులను వదలి వచ్చాను. వారు అక్కడ దైవారాధనను స్థాపించాలని భావిస్తున్నాను. వారి పట్ల సానుభూతి, ఆదరాభిమానాలను ప్రజల్లో కలిగించు. వారికి కావలసిన సదుపాయాలు ప్రసా దించు” అని వేడుకున్నారు.
దేవునిపై భారం వేసిన హాజిరాకు విశ్వ ప్రభువు సహనాన్ని, ధైర్యాన్ని ప్రసాదిం చాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వారి వద్ద ఉన్న ఆహారం, నీరు అయిపోయాయి. పసి బిడ్డతో సహా ఆమె ఆకలిదప్పులతో అలమటించసాగారు. బిడ్డకు పాలు పట్టడానికి ఆమె రొమ్ముల్లో పాలు కూడా రావడం లేదు. పసిబిడ్డ ఆకలితో దయనీయంగా ఏడుస్తున్నాడు. హాజిరా కన్నీరుమున్నీరయ్యింది. బిడ్డను అక్కడే నేల మీద వదలి నీటి కోసం, ఆహారం కోసం వెతుకాడుతూ తిరగ సాగారు. ఒక కొండను ఎక్కారు (ఈ కొండనే తర్వాత సఫా కొండగా పిలుస్తు న్నారు). ఆ కొండపై నుంచి ఆ లోయల మొత్తాన్ని పరిశీలించి చూశారు. మరో వైపున ఇంకో కొండ కనబడింది (దీనిని తర్వాత మర్వా కొండగా పిలుస్తున్నారు). ఆ కొండపై నుంచి చూస్తూ నీటి జాడ కన బడుతుందన్న ఆశతో ఆ కొండపైకెక్కారు. కాని ఏమీ కనబడలేదు. ఆమె ఆందో ళనతో మళ్ళీ మొదటి కొండపైకెక్కారు. ఆ విధంగా ఆమె నీటి కోసం వెదుకాడుతూ ఆ రెండు కొండల మధ్య ఏడుసార్లు పరు గులు తీశారు. (హజ్‌ యాత్ర సందర్భంగా సఫా మర్వా కొండల మధ్య ఏడుసార్లు పరుగెత్తుతూ చేసే ‘సయీ’ ఈ సంఘటన జ్ఞాపకార్థమే.)

జమ్‌జమ్‌

ఆమె నిరాశగా పసిబిడ్డ వద్దకు వచ్చారు. బిడ్డ పరిస్థితి దయనీయంగా ఉంది. ”ఓ ప్రభూ! కరుణించు” అంటూ మొర పెట్టుకున్నారు. బిడ్డ పరిస్థితి క్షణక్షణానికి దిగజారుతోంది. ఊపిరి మందగిస్తోంది. శ్వాస కష్టమవుతోంది. బాధాతప్త హృదయంతో, తన ఏకైక సంతానం కొన ఊపిరితో పెనుగులాడ డాన్ని ఆమె నిస్సహాయంగా చూడసాగారు. ఎండిపోయిన బిడ్డ గొంతు నుంచి ఎలాంటి ధ్వని రావడం లేదు. కేవలం కాళ్ళు కొట్టు కుంటున్న శబ్దం మాత్రం వినిపిస్తోంది. పసిబిడ్డ ఇస్మాయీల్‌ తన చిన్నారి కాళ్ళతో నేలను కొడుతున్న ప్రదేశంలో స్వచ్ఛమైన నీటి ఊట అకస్మాత్తుగా ఉబికి వచ్చింది. ఆమె తన కళ్ళను తాను నమ్మలేక పోయారు.

అల్లాహ్‌ పట్ల ఆమె చూపిన విధేయత, ఆమె ప్రదర్శించిన సహనాలకు అత్యుత్తమ బహుమానం లభించింది. ఎండిపోయిన నేల నుంచి స్వచ్ఛమైన జలధార ఉబికి వచ్చేలా చేశాడాయన. తనకు నమ్మకస్తుడైన స్నేహితుడు ఇబ్రాహీమ్‌ (అ) కుటుంబం కష్టాల నుంచి బయటపడే దారి చూపిం చాడు. హాజిరా ఆ స్వచ్ఛమైన నీటిని బిడ్డ నోటిలో పోశారు. ఆ నీటతో బిడ్డ ప్రాణాలు కుదుట పడటాన్ని ఆమె ఆనందంగా వీక్షించారు. కన్నీళ్ళతో ఆమె అల్లాహ్‌ాకు కృతజ్ఞతలు అర్పించారు. ఆ అద్భుతమైన జలధారలే ”జమ్‌ జమ్‌” జలంగా ప్రసిద్ధికెక్కాయి. 4000 సంవత్స రాల క్రితం నాటి ఈ జలధార నేటికి కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. లక్షలాది హజ్‌ యాత్రీకులకు అత్యంత ఆరోగ్యప్రదమైన నీటిని అందిస్తోంది. ఒకప్పుడు నిర్జనమైన ఆ ప్రదేశంలో జీవం తొణికిసలాడేలా చేసింది ఈ జమ్‌జమ్‌ జలమే.

మరిన్ని చిహ్నాలు

దూరదూర ప్రాంతాలకు చెందిన పక్షులు ఆ నీటిని చూసి దాహం తీర్చుకోవడానికి అక్కడ వాలడం ప్రారంభించాయి. యెమన్‌ నుంచి వస్తున్న ఒక అరబ్బు తెగ ”జుర్‌హుమ్‌” (యెమన్‌ వాసులు నిజమైన అరబ్బులు అనబడుతారు. వారు మాట్లాడే అరబీ భాష చాలా ప్రామాణికమైనది.) దూరం నుంచి పక్షులు గుంపులుగా ఆ ప్రదేశం వైపునకు వెళ్ళడాన్ని గమనిం చారు. విచారించడానికి కొందరిని అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళిన వారు అక్కడ నీటి వనరు ఉందని తెలిపారు. ఆ అరబ్బు తెగ ఆ ప్రదేశానికి వచ్చింది. ఆ నిర్జన ప్రదేశంలో మనుష్యుల్ని చూసి హాజిరా చాలా సంతో షించారు. తనకు, తన కుమారునికి అల్లాహ్‌ పరిరక్షణ లభించిందనడానికి సూచనగా ఆమె భావించారు. ఆ ప్రజల హృదయాల్లో అల్లాహ్‌ వారి పట్ల సాను భూతిని జనింపజేశాడు. ఆ ప్రదేశం వైపునకు వారు వచ్చేలా చేశాడు. ఆ విధంగా ఇబ్రాహీమ్‌ (అ) చేసిన ప్రార్థన ను దేవుడు ఆమోదించాడు.

ఆ ప్రదేశంలో జమ్‌జమ్‌ నీటి ఊట బయటపడినందువల్ల యెమన్‌ నుంచి అక్కడకు వచ్చిన జుర్‌హుమ్‌ తెగ అక్కడ విడిది చేయడానికి, ఆ నీటిని వాడుకోవ డానికి హాజిరా అనుమతి కోరారు. హాజిరా సంతోషంగా వారిని స్వాగతిం చారు. వారిని అతిథులుగా గౌరవిం చారు. వారిలో కొందరు తమ కుటుం బాలను అక్కడకు పిలిపించుకున్నారు. చాలా మంది ఆ ప్రదేశం (మక్కా)నే తమ శాశ్వత నివాసంగా మార్చుకున్నారు.

ఇబ్రాహీమ్‌ (అ) అభిలాష

నిర్మానుష్య ప్రదేశంలో తాను వదలి వచ్చిన తన భార్యాబిడ్డల గురించి ఇబ్రాహీమ్‌ (అ) ఎప్పుడూ చింతిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి వారిని చూసి వచ్చేవారు. తాను కోరిన విధంగా తన కుమారుడు పెద్ద వాడవ్వడాన్ని చూసి సంతృప్తి చెందేవారు. తన కుటుంబాన్ని ఆదుకున్న విశ్వప్రభువుకు కృతజ్ఞతలు అర్పించే వారు. తన కుటుంబానికి నిలువ నీడ కల్పించి, వారికి కావలసిన అన్నపానీ యాలు ఏర్పాటు చేసిన అల్లాహ్‌కు ధన్య వాదాలు తెలుపుకునేవారు.
నిరుపమానమైన త్యాగం

ఇబ్రాహీమ్‌ (అ) జీవితం యావత్తు విశ్వప్రభువు పట్ల నిబద్ధతను, చెక్కు చెదరని విశ్వాసాన్ని ప్రకటించే పరీక్షల సంగమం. దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నవారు ఎన్నడూ నిరాశ చెందరు. అల్లాహ్‌ ఆదేశాలను ఎన్నడూ ప్రశ్నిం చరు. అల్లాహ్‌ ఎల్లప్పుడూ చెడుపై మంచికి విజయాన్ని ప్రసాదిస్తాడని ప్రగా ఢంగా విశ్వసిస్తారు. ఇస్మాయీల్‌ (అ) చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు అల్లాహ్‌ మరోసారి ఇబ్రాహీమ్‌ (అ)ను కఠినమైన పరీక్షకు గురి చేశాడు. ఒక కల ద్వారా ఇబ్రాహీమ్‌ (అ) తన ఏకైక కుమారుణ్ణి అల్లాహ్‌ కోసం జిబహ్‌ చేయాలని ఆదేశించడం జరిగింది.

(బైబిల్‌లో కూడా ఈ ప్రస్తావన ఉమది. అబ్రహంకు అతని ఏకైక పుత్రుడు, ఇస్సాక్‌ను బలి ఇవ్వాలని ఆదేశించడం జరిగిందని. కాని ఇస్సాక్‌ ఆయన ప్రథమ పుత్రుడు కాదు. ఇస్మాయీల్‌ (అ) ఆయన జేష్ఠ పుత్రుడు. అంటే ఈ ఆదేశం అందిన సమయంలో ఆయనకు ఉన్న ఏకైక పుత్రుడు ఇస్మాయీల్‌ (అ) మాత్రమే. ఇస్సాక్‌ ఆ తర్వాత చాలా సంవత్సరాలకు జన్మించారు. ఇస్మాయీల్‌ (ఆ అరబ్బు తెగల్లో కలిశారు. ఆయన సంతానంలో ప్రవక్త అరబీ (స) జన్మించారు. కాగా ఇస్సాక్‌ సంతానంలో ఇతర ప్రవక్తలు జన్మించారు. అందువల్లనే అరబ్బులు, ఇస్రాయీల్‌ (ప్రవక్త యాకూబ్‌ (అ)గారి) సంతానం సోదరులని చెప్పడం జరుగు తుంది.)

ఆత్మ విశ్వాసంతో ఇబ్రాహీమ్‌ (అ) మక్కాకు బయలు దేరారు. ఈ వార్తను తన కుమారునికి చెప్పడం ఆయనకు ఒక పరీక్ష వంటిదే. అయితే ఇస్మాయీల్‌ (అ) కూడా తండ్రికి తగిన కుమారులు. ఆయన అనితర సాధ్యమైన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. దేవుని ఆదేశాన్ని అమలు చేయాలని ఆయన నిబ్బరంగా తన తండ్రికి చెప్పారు. ”నాన్నా! మీకు ఆజ్ఞా పించబడినట్లు చేెయండి. అల్లాహ్‌ా కోరిన విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని బదులిచ్చారు. ఆయన తన దుస్తులు తొలగించారు. తల్లికి సలాము చెప్పాలని తండ్రిని కోరారు. తన గుర్తులుగా తన దుస్తులు తల్లికివ్వాలని చెప్పారు. తాను కాళ్ళు చేతులు కొట్టు కోవడం జరిగితే తన తండ్రికి బాధ కలుగుతుందన్న ఉద్దేశ్యంతో తన కాళ్ళను చేతులను కట్టేయాలని తండ్రిని కోరారు. ఇబ్రాహీమ్‌ (అ) తన కత్తికి పదును పెట్టారు. ఆ విధంగా ఇస్మాయీల్‌ (అ)కు మృత్యు బాధ లేకుండా ఉండాలని భావిం చారు.

కుమారుడిని గట్టిగా కౌగలించుకుని రోదించారు. తర్వాత ఇస్మాయీల్‌ (అ)ను పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు. బాధాతప్త హృదయంతో కుమారుణ్ణి చివరిసారిగా చూసుకున్నారు. బరువెక్కిన హృదయంతో కత్తిని ఎత్తారు. ఇస్మాయీల్‌ (అ) గొంతుపై వేటు వేశారు. కాని ఆ కత్తి గొంతును కోయలేదు. తన తండ్రి తగినంత గట్టిగా కోయాలని తండ్రితో చెప్పారు. ఇబ్రాహీమ్‌ (అ)అలాగే చేశారు. అయినా ఆ కత్తి గొంతును కోయలేదు. ఇబ్రాహీమ్‌ (అ) ఆశ్చర్యపోయారు. తన బలహీనతను క్షమించవలసినదిగా ఆయన అల్లాహ్‌ాను వేడుకున్నారు. అల్లాహ్‌ా ఆయన వేడుకోలుకు బదులిచ్చాడు. ”ఇబ్రాహీమ్‌ (అ)! నీవు నిజంగా కలను సార్థకం చేశావు. మేము నీ విధేయతకు బహు మానం ప్రసాదిస్తున్నాము” అన్నాడు. ఆ తండ్రీకొడుకులు దేవుని ఆదేశం శిరసా వహిండానికి క్షణం వెనుకాడలేదు. అల్లాహ్‌ాకు కావలసింది బలి కాదు. తన ఆదేశాల పట్ల వారు చూపిన నిబద్ధతనే ఆయన పరీక్షించాడు. తండ్రీ కొడుకులు దేవుని కారుణ్యం పట్ల కృతజ్ఞతలు అర్పిం చారు. ఇస్మాయీల్‌ (అ)కు బదులుగా జిబహ్‌ా చెయ్యడానికి ఆ దగ్గరలోనే ఒక పెద్ద పొట్టేలు కనబడింది. అంతకు ముందు కోయడానికి మొండికేసిన కత్తి ఆ పొట్టేలు గొంతును ఒక్క వేటుకు కోసింది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం ఈదుల్‌ అజ్హా (ఖుర్బానీ పండుగ) సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడం జరుగుతుంది.

ద్వార బంధాన్ని మార్చడం

ఇస్మాయీల్‌ (అ) ఒక అందమైన యువకునిగా ఎదిగారు. జుర్‌హుమ్‌ తెగవారి వద్ద ఆయన అరబీ భాషను నేర్చు కున్నారు. ఈ తెగకు చెందిన అమ్మాయినే వివాహమాడారు. ఆయన చాలా బినందంగా జీవితాన్ని గడుపసాగారు. ఆయన జీవితంలో ఎదురైన ఒకే ఒక్క దుఃఖకరమైన సంఘటన ఆయనను అమితంగా ప్రేమించిన మాతృమూర్తి తనువు చాలించడం. ఇస్మాయీల్‌ (అ)ను కంటికి రెప్పలా సాకిన హాజిరా మరణిం చిన సంఘటన ఆయన్ను విపరీతంగా కలచి వేసింది.

ఇబ్రాహీమ్‌ (అ) అప్పుడప్పుడు వచ్చి కుమారుణ్ణి చూసి వెళ్ళేవారు. ఆ ఎడారిలో ఆయన కుమారుణ్ణి చూడడానికి అనేక రోజులు ప్రయాణం చేసి రావలసి వచ్చేది. ఒకసారి ఆయన వచ్చినప్పుడు ఇస్మాయీల్‌ (అ) ఇంట లేరు. ఆయన భార్య ఇంట ఉండటంతో ఆమెతో ఇబ్రాహీమ్‌ (అ) మాట్లాడారు. భర్త ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు. అయితే ఆమె ఆయన చెప్పే విషయాలు ఏవీ వినకుండా తన భర్త గురించి ఫిర్యాదులు ప్రారంభించింది. తమ బీద స్థితి గురించి చెప్పుకొచ్చింది. వచ్చింది ఎవరని కూడా ఆమె అడగలేదు. కనీసం మంచి నీరన్నా అందించలేదు. అసహనం నిండిన స్త్రీని ఇబ్రాహీమ్‌ (అ) ఆమెలో చూశారు. అల్లాహ్‌ా అనుగ్రహాలను గుర్తించే శక్తిలేని స్త్రీని చూశారు. ఆయన కనీసం తన ఒంటె నుంచి క్రిందికి కూడా దిగలేదు. ఆయన ఆమెతో, ”నీ భర్తను అడిగానని చెప్పు… ఇంటి ద్వారబంధాన్ని మార్చడం మరచిపోవద్దని చెప్పు” అని వెళ్ళిపోయారు.

ఇస్మాయీల్‌ (అ) ఇంటికి వచ్చిన తర్వాత ఆమె జరిగింది ఆయనకు చెప్పింది. వచ్చిన వ్యక్తి ఎలాఉన్నారని ఇస్మాయీల్‌ (అ) ప్రశ్నించారు. ఆమె ఆ వ్యక్తి ఆకారాన్ని వర్ణించింది. ఆ వచ్చింది తన తండ్రి అని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన మాటలకు అర్థాన్ని వివరిస్తూ, సరిగా లేని ద్వారబంధం ఇంటికి తగినది కాదనీ, దాని వల్ల మనిషికి ఎదురు దెబ్బలు తగలడమే కాదు, గాయాలు కూడా అవుతాయనీ, అదే విధంగా ఆమె తనకు తగిన భార్య కాదని అన్నారు.

కొంతకాలం తర్వాత ఇబ్రాహీమ్‌ (అ) తన కుమారుణ్ణి చూడటానికి మళ్ళీ వచ్చారు. అప్పుడు కూడా ఆయన కుమారుడు ఇంట లేరు. అయితే ఇంట మరో స్త్రీ ఉంది. ఆమె ఇస్మాయీల్‌ (అ) మళ్ళీ పెళ్ళాడిన స్త్రీ. ఆమె ఆయనకు నీరందించింది. భోజనం వడ్డించింది. ఆయన ఒంటె దిగి, ఆమెను ఆమె భర్త గురించి అడిగారు. తన భర్త వేటకు వెళ్ళారని ఆమె బదులిచ్చింది. ఆ కాలంలో ఎడారి జీవితం చాల కష్టంగా ఉండేది. ఆహారం కోసం వేటాడ్డానికి చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది.

ఆమె తన భర్త గురించి చెబుతూ ఆయన చాలా కష్టపడి తమను పోషిస్తు న్నారని ప్రశంసలతో ముంచెత్తింది. అల్లాహ్‌ాకు కృతజ్ఞతలు అర్పిస్తూ మాట్లా డింది. ఇబ్రాహీమ్‌ (అ) చాలా సంతోషిం చారు. ఇస్మాయీల్‌ (అ)కు తగిన భార్య లభించిందని ఆనందించారు. తాను ఎవరైనదీ ఆమెకు చెప్పలేదు. తాను ఒక స్నేహితుడిని అని మాత్రమే చెప్పారు. (ఆమె ఎలాంటి కోడలో తెలుసుకోవాలని ఆయన భావించారు. ఆమె గురించి తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా ఒక సందేశ రూపంలో అందించి ఆమెను ఆశ్చర్య పరచాలని భావించారు.) అక్కడి నుంచి బయలుదేరుతూ ఆయన ఆమె చూపిన అతిథి మర్యాదలకు కృతజ్ఞతలు చెప్పారు. ”నీ భర్త వచ్చిన తర్వాత నా సలాము చెప్పు. ఇప్పుడు ద్వారబంధం చక్కగా కుదిరిందని చెప్పు” అని వెళ్ళిపోయారు.

ఇస్మాయీల్‌ (అ) ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె జరిగింది వివరించారు. వచ్చిన అతిథి ఎలా ఉన్నారని ఇస్మాయీల్‌ (అ) ప్రశ్నించారు. ఆమె వివరించిన తర్వాత ఇస్మాయీల్‌ (అ) నవ్వుతూ, వచ్చినది తన తండ్రి అనీ, ఆయన నిన్ను నాకు తగిన భార్యగా అభివర్ణించారనీ, నీతో కలిసి ఉండాలని, నిన్ను కాపాడాలని కోరారని వివరించారు. ఇస్మాయీల్‌ (అ) జీవితాంతం ఆమెతో కలిసి ఉన్నారు. ఆమె ద్వారా ఆయనకు సజ్జన సంతానం కలిగింది.

కాబా నిర్మాణం

ఇబ్రాహీమ్‌ (అ) తన కుమారుణ్ని చూసి చాలా కాలమయ్యింది. ఈసారి ఆయన ఒక అతి ముఖ్యమైన పని చేయవలసి ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి ఆరాధనాలయాన్ని పునర్నిర్మించ వలసిందిగా అల్లాహ్‌ా ఆయన్ను ఆజ్ఞాపించాడు. మక్కా లోయలో ఈ ఆరాధనాలయం ప్రాచీన కాలంలో ఉండేది. ఇబ్రాహీమ్‌ (అ) మక్కా లోయకు వచ్చారు. అక్కడ జమ్‌జమ్‌ బావి వద్ద తన కుమారుడు ఇస్మాయీల్‌ (అ) బాణాలకు పదును పెడుతుండ టాన్ని చూశారు. తండ్రిని చూసి ఆయన అమితంగా సంతోషిం చారు. తండ్రీకొడుకులు ఆనందంతో కౌగిలించుకున్నారు. అల్లాహ్‌ తనకు కాబా గృహాన్ని నిర్మించమని ఆదేశించాడని ఇబ్రాహీమ్‌ (అ) కుమారునికి తెలియజేశారు. ఇస్మాయీల్‌ (అ) ఎల్లప్పుడూ తన ప్రభువు ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉండేవారు. ఇరువురు కలసి కాబా గృహం పునాదులు తవ్వసాగారు. ఈ పని చేస్తున్నప్పుడు వారి నోట క్రింది పదాలు వారి హృదయాల్లోని భావాలను వ్యక్తం చేస్తూ వెలువడసాగాయి.

”ఓ ప్రభూ! మా యిద్దర్ని ముస్లింలుగా జేయి. మా సంతానంలో ముస్లిం జాతిని ఉద్భవింపజేయి. మా ప్రయత్నాల ఫలితాలను మాకు చూపించు. మా పశ్చాత్తాపాన్ని స్వీకరించు. నీవే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడివి. అనంత కరుణామయుడివి”. (బఖరా:127,128)

ఇస్మాయీల్‌ (అ) రాళ్ళను మోసుకుని వస్తుంటే ఇబ్రాహీమ్‌ (అ) వాటిని అమర్చ సాగారు. కొంతకాలానికే నిర్మాణం రూపు రేఖలు దిద్దుకుంది. తమకు సహాయంగా ఎవరినీ వారు తీసుకోలేదు. గోడలు చాలా ఎత్తుకు లేచాయి. ఇప్పుడు రాళ్ళు పేర్చడానికి ఇబ్రాహీమ్‌ (అ)ఏదైనా ఎత్తు వేసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆయన ఇస్మాయీల్‌ (అ)తో ఏదైనా మంచి రాయి, తాను నిలబడటానికి చూడమని చెప్పారు. ఇస్మాయీల్‌ (అ) ఒక పెద్ద రాయిని అక్కడికి దొర్లించారు. (ఈ రాయి వేలాది సంవత్స రాలుగా పరిరక్షించబడుతున్నది. నేడు ‘మఖామె ఇబ్రాహీమ్‌’ అన్న పేరుతో గాజు పలకల మధ్య ఉన్న రాయి ఇదే.) ఆ విధంగా కాబా గృహం నిర్మించబడింది. మక్కాలో కాబా గృహం నిర్మించ బడినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్త ముస్లింలకు (దైవ విధేయులకు) పవిత్ర గృహంగా అలరారుతోంది. విశ్వప్రభువైన అల్లాహ్‌ పట్ల తమ కృతజ్ఞతలను ముస్లింలు ఇక్కడికొచ్చి తెలియజేస్తుంటారు.

గ్రహించవలసిన పాఠాలు

ఇబ్రాహీమ్‌ (అ)ను ప్రవక్తల పితామహునిగా పేర్కొనడం జరిగింది. సమాజంలో షిర్క్‌ (బహుదైవారాధన)ను దురాచా రాలను తుదముట్టించడానికి ఆయన నిరంతరం శ్రమించారు.
ఇబ్రాహీమ్‌ (అ) తండ్రి అల్లాహ్‌ సందేశాన్ని తిరస్కరించినప్పుడు ఆయన తన తండ్రిని నిందించలేదు. ఆయన సాఫల్యం కొరకు ప్రార్థించారు. ఆయనను సత్యసందేశం స్వీకరించేలా మార్చాలని ఆశించారు. తండ్రి పట్ల ఆయన గౌరవాదరణలతో వ్యవహరించారు. ఆయన పట్ల గౌరవమర్యాదల్లో లోటు చేయలేదు. ఇబ్రాహీమ్‌ (అ) అల్లాహ్‌ పట్ల పూర్తి విశ్వాసం కలిగి నవారు. ఎలాంటి త్యాగానికైనా వెనుదీయని వ్యక్తిత్వం ఆయనది. విశ్వప్రభువైన అల్లాహ్‌ ఆయన్ను ”ఖలీలుల్లాహ్‌” (అల్లాహ్‌ మిత్రుడు)గా అభివర్ణించాడు.

విగ్రహారాధకులను ఎదుర్కొన్నప్పుడు ఆయన అనితర సాధ్యమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. వారు అత్యంత పవిత్రంగా భావిస్తున్న అంశాల్లోని ఔచిత్యాన్ని నిర్భయంగా ప్రశ్నించారు. మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం లేెనప్పుడు ఆయన తన నిరసనను చేతల్లో చూపించారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. అందువల్ల ఆయన్ను అగ్ని గుండంలోకి విసిరివేయడం జరిగింది. కాని అల్లాహ్‌ా పట్ల ఆయనకున్న చెక్కుచెదరని విశ్వాసం ఆయన్ను కాపాడింది.

ఆయన భార్యలు సారా, హాజిరా ఇద్దరూ సౌశీల్యవతులు, ఆయన పట్ల పూర్తి విధేయత కలిగినవారు. సహనంతో వ్యవహరిస్తూ గొప్ప గొప్ప త్యాగాలు చేశారు. అందుగ్గాను అల్లాహ్‌ వారికి అనేక విధాల బహూకరించాడు. హాజిరా పట్ల, హాజిరా కుమారుని పట్ల ఇబ్రాహీమ్‌ (అ) గారి శ్రద్ధ చూసి సారా అసూయపడటం మానవ సహజమైన ప్రతిక్రియగా అర్థం చేసుకోవాలి. ఇబ్రాహీమ్‌ (అ) కుమారుడు ఇస్మాయీల్‌ (అ) తండ్రికి తగిన తనయుడు. తనకు తాను ప్రాణ త్యాగానికి సిద్ధమై అల్లాహ్‌ సంతుష్టిని పొందారాయన.

అల్లాహ్‌కు మానవ బలి అవసరం లేదు. అల్లాహ్‌ కోసం కన్నకొడుకును జిబహ్‌ చేయడానికి సిద్ధపడడాన్ని, అల్లాహ్‌ సేవ కోసం కన్న కుమారుడిని అంకితం చేయడంగా మనం అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలం.వారు నిర్మించిన కాబా గృహం దేవుని ఏకత్వానికి చిహ్నంగా గత 4000 ఏళ్ళ సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది.

 

Related Post