హజ్జ్‌ స్ఫూర్తి

హజ్జ్‌ స్ఫూర్తి  – ”హజ్జ్‌కై ప్రజలలో ప్రకటనగావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర మార్గల నుంచి కాలి నడకన కూడా వస్తారు. బక్కచిక్కిన ఒంటెలకపై కూడా స్వారీ అయి వస్తారు. వారు తమ ప్రయోజనాలు పొందడానికి రావాలి”. (అల్‌హజ్జ్‌: 27,28)

గూటిలో కూర్చుని నా ఉపాధి నా వద్దకు వస్తుందిలే అని ఒక మామూలు పక్షి ఆలోచించనప్పుడు సృష్టి శ్రెష్టుడయిన మానవుడు ఇలా ఆలోచించడం ఎంత విడ్డూరం!

మనిషి మానసిక, నైతిక, ఆధ్యాత్మిక వికాసానికి అమల సాధనం హజ్జ్‌. హజ్జ్‌ మహారాధన ద్వారా మనిషి తన విశ్వాసాన్ని (అఖీదాను), తన ఆరాధనలను (ఇబాదాత్‌ను), తన ప్రవక్తనను (అఖ్లాక్‌ను) మెరుగు పర్చుకుంటాడు. హజ్జ్‌ గురించి మన పండితులు చెప్పిన మాట: ”హజ్జ్‌కి ముందు చెడ్డోడిగా ఉన్న వ్యక్తి హజ్జ్‌ తర్వాత మంచోడిగా మారతాడు. హజ్జ్‌కి ముందు మంచోడిగా ఉన్న వ్యక్తి హజ్జ్‌ తర్వాత ఉత్తముడిగా మారతాడు. హజ్జ్‌కి ముందు ఉత్తముడిగా ఉన్న వ్యక్తి హజ్జ్‌ తర్వాత ఉత్తమోత్తమునిగా రూపాంతరం చెందుతాడు”. హజ్జ్‌ ద్వారా నైతికంగా, ఆధ్యాత్మికంగా, అఖీదా పరంగా క్రింది స్థాయి వ్యక్తి నుండి పై స్థాయి వ్యక్తి వరకూ వచ్చి తీరాల్సిన మార్పు ఇది.

దీన్నే మనం ఇస్లాం స్థాయి, ఈమాన్‌ స్థాయి, ఇహ్సాన్‌ స్థాయిగా కూడా చెప్పొచ్చు. ”వారు తమ ప్రయోజనాలు పొందానికి రావాలి”. (అల్‌హజ్జ్‌:28) అన్న అల్లాహ్‌ ఆదేశంలో ఇది కనీస ప్రయోజనం అని గ్రహించాలి. ఇక హజ్ విశిష్ఠత గురించి తెలియజేస్తూ ప్రవక్త (స) ఇఆల అన్నారు: ”ఎవరయితే ఈ గృహాన్ని ఉద్ధేశించి హజ్జ్‌ చేస్తారో, హజ్జ్‌ మధ్య ఎలాంటి అసభ్య కార్యాలకు, అశ్లీల కార్యాలకు ప్పాడకుండా ఉంటారో వారు – అదే రోజున తల్లి కడుపున జన్మించిన పసికందుని వలే (పాప రహితులయి) తిరిగి వస్తారు”. (బుఖారీ, ముస్లిం)

వేరోక సందర్భంలో ఆయన చెప్పిన మాట – ”హజ్జ్‌ మరియు ఉమ్రాలు తరచూ చేస్తూ ఉండండి. నిశ్చయంగా అవి – పేదరికాన్ని, పాపాన్ని ప్రక్షాళిస్తాయి. ఎలాగయితే ఇనుముకి పట్టిన తుప్పును నిప్పు వదలగొడుతుందో”. (నసాయీ)
ప్రార్థన, ఆరాధన ఏదయినా అందులో రెండు షరతులు లేనిదే అది స్వీకరించ బడదు.

1) ఇఖ్లాస్‌ – కేవలం అల్లాహ్‌ ప్రసన్నత కోసం చెయ్యాలి. 2) ఇత్తిబా: మనం చేసే ఆ ఆరాధన, ప్రార్థన ప్రవక్త (స) వారి సున్నత్‌కు అనుగుణంగా ఉండాలి. ఇలా చేయబడిన అల్లాహ్‌ సన్నిధిలో స్వీకృతికి నోచుకుంటుంది. అలా స్వీకృతి పొందిన హజ్జ్‌ పుణ్యాన్ని తెలియజేస్తూ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”స్వీకృతి పొందిన హజ్జ్‌ (హజ్జ్‌ మబ్రూర్‌)కు ప్రతిఫలంగా ఏది సరిపోదు; ఒక్క స్వర్గం తప్ప”. (ముస్లిం)

ఆశ మరియు భయం తప్పనిసరి:

”ఇంకా ఇవ్వవలసిన దాన్ని ఇస్తూ కూడా, తమ ప్రభువు వద్దకు మరలి పోవలసి ఉందనే భావనతో వారి హృదయాలు వణుకుతూ ఉంటాయి”. (అల్‌మోమినూన్‌: 60)
ఈ ఆయతు అవతరించినప్పుడు విశ్వాసుల మాత హజ్రత్‌ ఆయిషా (రఈఅ) గారు ప్రవక్త (స) వారిని ఇలా ప్రశ్నించారు: ”యా రసూలల్లాహ్‌! ”ఇవ్వ వలసిన దాన్ని ఇస్తూ కూడా …భయ పడే వారు” అని ఈ ఆయతులో పేర్కొన బడిన వ్యక్తి ఎవరు? వ్యభిచారా? త్రాగుబోతా? అని. అందుకు ప్రవక్త (స) – ”కాదు ఓ సిద్దీఖ్‌ కూతురా! అతను ఉపవాసాలూ ఉంటాడు. నమాజు కూడా చేస్తాడు. దాన ధర్మాలు కూడా చేస్తాడు. కానీ (తన వల్ల జరిగిన ఏ తప్పిదం వల్లనయినా) తన సత్కార్యాలు స్వీకారయోగ్యం కాకుండా పోతాయేమోనన్న భయం అతనికి ఉంటుంది” అని వివరణ ఇచ్చారు. (ముస్నద్‌ అహ్మద్‌)

ఇమామ్‌ హసన్‌ బస్రీ(రహ్మ) ఇలా అన్నారు: ”విశ్వాసి ఉపకారం చేసి కూడా భయపడుతూ ఉంటాడు. కపటి అపకారం చేసి కూడా నిశ్శించతగా ఉంటాడు”.
స్వయంగా ప్రవక్తల పితామహులయిన హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అ) కాబా గృహ గోడలను నిర్మిస్తూ చేసిన ప్రార్థన:
”ఇబ్రాహీమ్‌ (అ), ఇస్మాయీల్‌ (అ) – ఇద్దరూ (కాబహ్‌) గృహ పునాదులను, గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు: రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నాక అంతస్ సమీవుల్ అలీమ్ – ”మా ప్రభూ! మా సేవను స్వీకరించు”. (అల్‌ బఖరహ్‌: 127)

ఉహైబ్‌ బిన్‌ అల్‌ వర్ధ్‌ అను సజ్జనుడు ఈ ఆయతు చదివిన పిమ్మట బోరున విలపిస్తూ ఇలా అన్నాడు: ”ఓ రహ్మాన్‌ మిత్రుడా! నువ్వు కరుణామయుని గృహ గోడలను ఎత్తుతూ కూడా ఎక్కడ అది నీ నుండి స్వీక రించ బడదేమోనని భయ పడుతున్నావా?”. (ఇబ్బు అబీ హాతిమ్‌)

ప్రవక్తల పితామహులయిన, ముత్తఖీన్‌ల (దైవభితి పరుల) ఇమామ్‌ అయిన, మువహ్హిదీన్‌ల (ఏక దైవారాధకుల) నాయకుడయిన హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అ) వంటి మహాత్ముడికే కర్మ స్వీకరణ సంబంధించిన భయం ఉంటే, మన లాంటి మామూలు స్థాయి వ్యక్తుల్లో అది ఏ స్థాయిలో ఉండాలో బేరీజు వేసుకోవాలి!

‘లబ్బయిక్‌ అల్లాహుమ్మ’ నిత్యం అవ్వాలి:

”అల్లాహ్‌ ప్రసన్నత కోసం హజ్జ్‌ మరియు ఉమ్రాలు పూర్తి చేయాలి” (అల్‌ బఖరహ్‌: 196) అన్న అల్లాహ్‌ ఆహ్వాన్ని అంగీకరించి విశ్వ వ్యాప్తంగా నినసించే విశ్వాసులు ప్రతి ఏడాది లక్షల సంక్యలో కాబహ్‌ గృహం వైపునకు తరలి వెళుతున్నారు. నిర్ణీత స్థలానకి (మీఖాత్‌కు) చేరుకున్నాక అందరూ అన్నింటిని విసర్జించి కేవలం రెండు దుప్పట్లు కప్పుకొని చెప్పే మాట, చేసే నినాదం – ‘లబ్బయిక్‌ అల్లాహుమ్మ లబ్బయిక్‌’ – హాజరయ్యాను ఓ అల్లాహ్‌ నేను హాజరయ్యాను. ఒక హాజీ ఇదే నినాదాన్ని ఒక రుక్న్‌ నుండి మరో రుక్న్‌కి మారుతూ, ఒక స్థలం నుండి మరో స్థలానికి మారుతూ, ఒక స్థితి నుండి మరో స్థితికి మారుతూ, ఒక మష్‌అర్‌ నుండి మరో మష్‌అర్‌కి మారుతూ నినదిస్తూనే ఉంటాడు.

ఎంత వినయం, ఎంత అణకువ, ఎంత భక్తిప్రపత్తత, ఎంత తన్మయం, ఎమత తాదాత్మ్యం! మరి ఇదే విధమయినటు వంటి విధేయత అల్లాహ్‌ అన్య ఆదేశాల విషయంలో, అన్ని వేళల్లోనూ ఉండాలి. హజ్‌ గురించి ఆదేశించిన అల్లాహ్‌యే, ఐదు పూటల నమాజు, రమజాను ఉపవాసాలు, జకాత్‌, తల్లిదండ్రు సేవ,అనాథల ఆదరణ, వితంతువు పోషణ, దేశ, ప్రాంత, కుటుంబ రక్షణ గురించి కూడా ఆదేశించాడు. హజ్జ్‌ సందర్భంగా ఒక హాజీ ఎలాగయితే ఇహ్రామ్‌ నిషేధితాల నుండి దూరంగా ఉంటాడో, అలాగే జీవితాంతం అల్లాహ్‌ నిషేధించిన, షిర్క్‌, వ్యభిచారం, హత్య, మాదక ద్రవ్యాల సేవనం, అబద్దం, మోసం, ద్రోహం నుండి కూడా దూరంగా ఉండాలి. అప్పుడే మనం పూర్ణ స్థాయి ముస్లింలము అవుతాము. అల్లాహ్‌ ఇలా ఆదేశిస్తున్నాడు: ”ఓ విశ్వాసులారా! ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి”. (అల్‌ బఖరహ్‌: 108)

ఇమామ్‌ ముజాహిద్‌ (రహ్మ) ఈ ఆయతు గురించి ఇలా వ్యాఖ్యానించారు: ”అంటే, విధులన్నింనీ నిర్వర్తించండి. మంచికి సంబం ధించిన అన్నింటినీ అమలు పర్చండి”.
ఇదే బావార్థాన్ని తెలియజేసే ప్రవక్త (స) వారి ఓ ప్రవచనం ఉంది. చివరి హజ్జ్‌ సందర్భంగా ఆయన చేసిన ఉపదేశం ఇది: ”ప్రజలారా! మీ ప్రభువుకు భయ పడండి. మీ (పై విధిగావించ బడిన) అయిదు పూటల నమాజును చదవండి. మీ (పై విధిగావించ బడిన రమజాను) మాసపు ఉపవాసాల్ని పాటించండి. మీ సొమ్ము నుండి జకాతును చెల్లించండి. మీకు ఏదేని ఆదేశం అందితే శిరసా వహించండి. (ఇలా గనక మీరు చేస్తే) మీ ప్రభువు స్వర్గ వనాలలో ప్రవేశిస్తారు సుమండి”. (తిర్మిజీ)

తవక్కుల్‌ అసలు అర్థం:

ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (రహ్మ) ఇలా అన్నారు: అల్లాహ్‌ను నమ్ముకునే విషయంలో మనం ప్రజల్ని మూడు శ్రేణులుగా విభజించ వచ్చు. రెండు అతివాదాలయితే ఒకటి మితవాదం, మధ్యే మార్గం. 1) తవక్కుల్‌ని కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో కారకాలను వదులుకునే వారు. 2) కారకాలను కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో తవక్కుల్‌ను వదులుకునే వారు.3) కారకాలను అన్వేషిస్తూనే అల్లాహ్‌ మీద తవక్కుల్‌ను సయితం కాపాడుకునేవారు. మరింత విపులంగా అర్థమవ్వాలంటే, హజ్రత్ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) గారి ఉల్లేఖనాన్ని తెలుకోవాల్సిందే!

”యమన్‌ దేశానికి చెందిన కొందరు హాజీలు ప్రయాణ సామగ్రిని అసలు తోడు తీసుకునే వారు కారు. పైగా ”మేము అల్లాహ్‌ యెడల సిసలయిన తవక్కుల్‌ గల వారం” అనే వారు. వారు మక్కా వచ్చాక అక్కడ వీరితో వారితో అడుగుతుండే వారు. అప్పుడు అల్లాహ్‌ ఈ ఆయతును అవతరింప జేశాడు: ”(హజ్జ్‌ ప్రయాణానికి బయలు దేరనప్పుడు) ప్రయాణ సామగ్రి (ఖర్చు)ని వెంట తీసుకెళ్ళండి. అయితే అన్నింటికంటే అత్యుత్తమ సామగ్రి తఖ్వా (దైవభీతి అని బాగా తెలుసుకోండి)”. (అల్‌ బఖరహ్‌: 197)

ముఆవియహ్‌ బిన్‌ ఖర్రహ్‌ ఉల్లేఖనం – హజ్రత్‌ ఉమర్‌ (ర) గారు కొందరు యమన్‌ వాసుల (విచిత్ర వాలకం)ను చూసి – ”ఎవరు మీరు?” అని ప్రశ్నించారు. అందుకు వారు – ”మేము అల్లాహ్‌ యెడల (ముతవక్కిలూన్‌) సిసలయిన తవక్కుల్‌ గల వారం” అన్నారు. అది విన్న ఆయన (ర) – ”ఎంత మాత్రం కాదు. మీరు ప్రజల మీద ఆధార పడేవారు – ముత్తకిలూన్‌” అని చెప్పడమే కాక, తవక్కుల్‌ సరయిన అర్థాన్ని కూడా తెలియజేశారు: ”ముతవక్కిల్‌ ఎవరంటే విత్తును భూమిలో నాటి ఆ తర్వాత అల్లాహ్‌ మీద భరోసా ఉంచే వాడు”.

ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (రహ్మ) గారిని – ‘ఇంట్లో ఓ చోట కూర్చుని తన ఉపాధి తన దగ్గరకు వస్తుంది’ అని వాదించే వ్యక్తిని గురించి అడగడం జరిగింది. అందుకాయన – ”అతను సరయిన జ్ఞానం లేని వాడు. ఏమిటి ప్రవక్త (స) వారి ఈ మాట అతని చెవిన పడ లేదా? ”నిశ్చయంగా నా జీవనోపాధి నా బాణం క్రింద ఉంచ బడింది”. అయన ఓ పక్షి గురించి చెప్పిన మాట అతను విన లేదా? ”అది ఉదయాన్నే ఖాళి కడపుతో బయలుదేరతుంది. సాయత్రానికి కడుపు నింపుకొని గూటికి తిరిగి వస్తుంది”. (తిర్మిజీ). గూటిలో కూర్చుని నా ఉపాధి నా వద్దకు వస్తుందిలే అని ఒక మామూలు పక్షి ఆలోచించనప్పుడు సృష్టి శ్రెష్టుడయిన మానవుడు ఇలా ఆలోచించడం ఎంత విడ్డూరం!

తవక్కుల్‌ మరియు కారకాల విషయంలో పండితుల మాట ఏమిటంటే, ఎవరయితే కేవలం కారకాలను నమ్ముకుంటారో వారు షిర్క్‌కు పాల్పడినట్లు. ఎవరయితే కారకాలే ఉండకూడదంటారో వారు పిచ్చోళ్ళు. కారకాలను అంగీకరించి వాటిని అన్వేషించని వారు ధర్మంలో లేని కార్యాన్ని ఒడిగడుతున్నారు. కారకాలను అన్నేషిస్తూ అల్లాహ్‌ను నమ్నుకునే వారు-వీరే విశ్వాసులు”.

ఇస్లామీయ త్రాడు:

విశ్వాసుల ఈ విశ్వ జనీన సమావేశానికి ప్రేరణ ఏది? అంటే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’. ఇదే బలమయిన కడియం, ఇదే అల్లాహ్‌ త్రాడు. ఇదే స్థిర మయిన వచనం. ఇదే నిత్యం ఫలాన్నందించే పరిశుద్ధ వృక్షం. దీని ఆధారంగానే అల్లాహ్‌ భుమ్యాకాశాలను నిర్మించాడు. దీని ప్రబోధనం కోసం ఒక లక్ష 24 వేల మంది ప్రవక్తలను ప్రభవింప జేశాడు. దీని మూలంగా విశ్వాసులు అవిశ్వాసులన్న విభజన జరిగింది. దీని మూలంగా స్వర్గ నరాకాలు ఉనికిలో వచ్చాయి. దీని మూలంగానే అదృష్ట దురదృష్టాల నిర్థారణ జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్మరణలో ఈ వచన స్మరణకు మించింది లేదు. భుమ్యాకాశాలను ఒక పళ్ళెంలో పెట్టి ఈ సద్వచనాన్ని మరో పళ్ళెలో పెడితే ఈ సద్వచనం ఉన్న పళ్ళెమే బరువుగా ఉంటుంది. ఈ సద్వచనం ఉంటే సర్వం ఉన్నట్టు. ఈ సద్వచనం లేక పొతే సర్వం కోల్పోయినట్టు. అందుకే హజ్జ్‌ అక్బర్‌ దినమయిన అరఫా దినాన ప్రవక్తలందరూ ఈ సద్వ చనాన్ని అత్యధికంగా స్మరించారు అన్నారు ప్రవక్త (స). ఈ సద్వచనాన్ని ఎవరయితే స్వచ్ఛమయిన మనుసులో పలుకుతారో వారు స్వర్గానికి వెళతారు అని ఒక చోట అంటే, ఈ సద్వచనాన్ని మనస్ఫూర్తిగా నమ్మేవారు కాపట్యానికి దూరంగా ఉంటారు అని మరో సందర్భంలో సెలవిచ్చారు. ఈ సద్వచనం అర్థం ఏమీతో తెలిసి మరణించిన వ్యక్తి స్వర్గ వాసి అని ఓ సారి చెబితే, ఈ వచనం పలుకుతూ ఒకరు తుది శ్వాసి వదలడం శుభ సూకరం అన్నారు ప్రవక్త (స). ఈ సద్వచనంలో ఉన్న తౌహీద్‌ భావన మాత్రమే ముస్లింలను ముత్తహిద్‌ – సమైక్య పర్చ గలదు. ఇది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.

Related Post