కష్టాలు కడగండ్లు కరగాలంటే… 

కష్టాలను కరిగించే కరదీపికలు

1) దుఆ

దుఃఖాన్ని దూరం చేసే  గొప్ప ప్రార్థనలలో ఒకటి  ప్రవక్త యూనుస్ (అ)  వారి  ప్రార్థన.

”లా ఇలాహ ఇల్లా అంత సుబ్‌హానక ఇన్నీ కుంతు మిన జ్జ్వాలిమీన్‌”

 చివరికతను (చేప కడుపులో చిక్కుకొని) గాఢాంధకారంలో “నీవుతప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. నీవు పరిశుద్ధుడవు. నేను నిజంగా దుర్మార్గుణ్ణయ్యాను” అని మొరపెట్టుకున్నాడు. మేమతని మొరాలకించి అతడ్ని బాధ, పరితాపాల నుండి విముక్తి కల్గించాం. ఇలాగే మేము విశ్వాసుల్ని రక్షిస్తాం. (అన్ బియా: 87-88)

2) ధర్మ పాలన: మనం ధర్మ శాస్త్రానికి కట్టుబడి జీవిస్తే అల్లాహ్ మనల్ని రక్షిస్తాడు.

3) అల్లాహ్ స్మరణ: కలిమి స్థితిలో మనం అల్లాహ్ను గుర్తిస్తే, కష్ట  సమయంలో అల్లాహ్ మనల్ని గుర్తిస్తాడు.

4) మనం మారితే మన స్థితి మారుతుంది: అల్లాహ్ ఆదేశాలకనుగుణంగా మన జీవితాన్ని మనం మార్చుకుంటే మనకే సమస్య వచ్చినా అల్లాహ్ మన ముందుండి ఆదుకుంటాడు.

5)  దైవ భీతి:

అల్లహ్ ను , అంతిమదినాన్ని విశ్వసించినవారికి ఈమాటల ద్వారా ఉపదేశం చేయ బడుతోంది. అల్లాహ్ కు భయపడుతుండేవాడికి అల్లాహ్ కష్టాలనుంచి బయటపడే దారి చూపుతాడు. (ఒకవేళ ఏవైనా  ఇబ్బందులుంటే) అతనికి అల్లాహ్  అతని ఊహ సైతం పోని దిశ నుండి ఉపాధినిస్తాడు. (తలాఖ్: 2-3)

6) సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యెడల నమ్మకం:

అల్లాహ్ ను  నమ్ముకునేవాడికి అల్లాహే  చాలు. అల్లాహ్  తన పని తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన ప్రతిదానికీ ఓలెక్క నిర్ణయించిపెట్టాడు. (తలాఖ్: 3)

పండితుల మాట బంగారు మూట:

నలుగురు నాలుగు విధాలు అనడం ఒక ఆనవాయితీ. అయితే ఆనలుగురు నాలుగు వేర్వేరు సమస్యలతో సమతమవుతూ కూడా ఈ విషయాలను వారు  ఎలా విస్మరిస్తున్నారో  మాకు అంతుబట్టడం లేదు అన్నారు పండితులు. ఎవరా నలుగురు? ఏమిటి వారి సమస్యలు? వారు మరచిన ఆ విషయాలు ఏవి? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

 1) అనారోగ్యంతో, అస్వస్థతతో బాధ పడే వ్యక్తి  సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ  మాటలను  నిర్లక్ష్యం  చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది:

అయ్యూబ్‌ గాధ కూడా గుర్తుకుతెచ్చుకో. అతను (వ్యాధిగ్రస్త స్థితిలో ఉండి) “ప్రభూ!) నేను జబ్బు పడ్డాను. నీవు అందరికంటే గొప్ప దయామయుడవు” అని ఎలుగెత్తి మొరపెట్టుకున్నాడు. మేమతని మొరాలకించి అతని బాధ దూరం చేశాం. అతనికి మేము అతని భార్యాపిల్లలనే కాదు, మా ప్రత్యేక అనుగ్రహంతో ఇంకా అనేక భాగ్యాలు కూడా ప్రసాదించాం. దైవభక్తులకు ఇదొక (మంచి) గుణపాఠం. (అన్ బియా: 83-84)

2) భరించరాని దుఃఖంతో శోక సముద్రంలో నిండా మునిగిన వ్యక్తి అల్లాహ్ ఈ  మాటలను  ఎలా నిర్లక్ష్యం  చేశాడు అని  ఆశ్చర్యమేస్తుంది.

మత్స్యబాధితుడి సంగతి జ్ఞాపకంతెచ్చుకో. అతను కోపం వచ్చి వెళ్ళిపోయాడు. మేము తనను నిలదీయబోమని భావించాడు. చివరికతను (చేప కడుపులో చిక్కుకొని) గాఢాంధకారంలో “నీవుతప్ప మరోఆరాధ్యుడు లేడు. నీవు పరిశుద్ధుడవు. నేను నిజంగా దుర్మార్గుణ్ణయ్యాను” అని మొరపెట్టుకున్నాడు. మేమతని మొరాలకించి అతడ్ని బాధ, పరితాపాల నుండి విముక్తి కల్గించాం. ఇలాగే మేము విశ్వాసుల్ని రక్షిస్తాం. (అన్ బియా: 87-88)

3) సంతాన లేమితో నిరాశ నిస్ప్రుహకు లోనై  దండగా అన్నంతగా మానసిక ఒత్తిడికి లోనైన వ్యక్తి అల్లాహ్ ఈ  మాటలను  ఎలా నిర్లక్ష్యం  చేశాడు? అని  ఆశ్చర్యమేస్తుంది.

జకరియ్యా వృత్తాంతం కూడా జ్ఞాపకం తెచ్చుకో. అతను తన ప్రభువు సన్నిధిలో “ప్రభూ! నన్ను (సంతానం లేకుండా) ఒంటరివాడ్ని చేయకు. నీవే అందరికంటే మంచి వారసుడివి” అని ప్రార్థించాడు. మేమతని ప్రార్థన ఆలకించి అతనికి యహ్యాను అనుగ్రహించాం. అతని కోసం అతని భార్యను (గర్భధారణకై) తీర్చిదిద్దాము. వీరంతా అమితోత్సాహంతో సత్కార్యాలు చేస్తుండేవారు. మమ్మల్ని ఎంతో ఆశతో, భయభక్తులతో ప్రార్థించేవారు. మాముందు ఎంతో అణుకువతో ఉండేవారు. (అన్ బియా: 89-90)

4) ఏ వ్యక్తికీ వ్యతిరేకంగానైతే  ప్రజలు కుట్రలు పన్నుతున్నారో  ఆ వ్యక్తి  అల్లాహ్ ఈ  మాటను  ఎలా నిర్లక్ష్యం  చేసి ఉంటాడు? అని  ఆశ్చర్యమేస్తుంది. 

నేను మాత్రం నా వ్యవహారాన్ని దేవునికి అప్పగిస్తున్నాను. ఆయనే తన దాసులకు సంరక్షకుడు.” చివరికి అల్లాహ్  వారు పన్నిన కుట్రలు, కుయుక్తులన్నిటిని వమ్ముచేసి ఆ విశ్వాసిని కాపాడాడు. ఫిరౌన్‌ అనుయాయులే ఘోరవిపత్తులో చిక్కుకొని సర్వనాశన మయ్యారు.  (మోమిన్: 44-45)

5) భయంతో బిక్కుబిక్కుమంటూ బతికే వ్యక్తి   ఎలా అల్లాహ్ ఈ  మాటను   నిర్లక్ష్యం  చేసి ఉంటాడు? అని  ఆశ్చర్యమేస్తుంది. 

 వారు ద్విగుణీకృత విశ్వాసంతో “మాకు అల్లాహే  చాలు, ఆయన గొప్ప కార్యసాధకుడు” అని సమాధానమిచ్చారు. చివరికి వారు అల్లాహ్ అనుగ్రహంతో, బహుమానాలతో తిరిగి వచ్చారు. వారికి ఎలాంటి నష్టం జరగలేదు. వారు అల్లాహ్  అభీష్టం ప్రకారం నడుచు కున్నారు. దేవుడు (ఇలాంటివారికే) అపారంగా అనుగ్రహించేవాడు. (ఆల్ ఇమ్రాన్: 172-174)

అభిమాన మిత్రులారా! మనం ఎన్ని అనుగ్రహాలలో ఉన్నామో ఒక్క సారీ నెమరు వేసుకొండి, అప్పటికీ  అర్థం కాకపొతే ఒకేఒక్క సారి పాలస్తీనా ప్రజల్ని జ్నప్తికి తెచ్చుకోండి.
     ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ బాంబుల దాడికి మృతి చెందిన పాలస్తీనీయన్లు 8000 మంది కాగా, వారిలో 2/3 వంతు మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. రెండు మూఢ సార్లు వెదికెక్కి ఆ పీడిత ప్రజల గురించి మాట్లాడితేనే, నాలుగైదు పేజీల వ్యాసం వారి గురించి రాస్తేనే  విసుగు చెందే ప్రబుద్ధులు నేడు మన మధ్య చాలా మం దే ఉన్నారు. అయితే అక్కడ వారు 75 ఏళ్లుగా వారు భీకర వాతావరణంలో జీవిస్తున్నా రు..వారి సొంత గడ్డపై భద్రత లేని బతుకులు వెల్లదీస్తున్నారు. . ఇప్పుడు జరుగుతున్న ఈ మారణకాండ వారిని  పూర్తిగా తుదముట్టించేంత వరకు ఆగేలా లేదు. రక్షించేవారు లేక మా ప్రాణాలు గాల్లో తేలుతున్నాయి’ అని అక్కడి తల్లుల రోదిస్తున్నారు.
 దిక్కులేక పోవడం చూసి అణచి వేయబడ్డ స్త్రీలు, పురుషులు, పిల్లలను రక్షించడానికి మీరు దైవమార్గంలో ఎందుకు పోరాడరు? వారు (బాధలు భరించలేక) “దేవా! దుర్మార్గులు నివసిస్తున్న ఈ నగరం నుండి మమ్మల్ని బయటికి తీసి కాపాడు. మాకు రక్షణ కల్పించి అండగా నిలిచేవారి నెవరినైనా నీ వైపు నుండి మా దగ్గరికి పంపు” అని మొరపెట్టుకుం టున్నారే! అలాంటి పీడిత ప్రజల రక్షణ కోసం ఎందుకు పోరాడరు మీరు? (అన్నిసా: 74-75)  

అభిమాన మిత్రులారా!

 గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు మంచినీరు దొరక్క…. ఆకలి తీర్చుకోవడానికి ఇంత ఆహారం లభించక వారు అల్లాడిపోతున్నారు. బాధితుల ఆర్తనాదాలు అధికమవుతున్న కొద్దీ ఆసుపత్రుల్లో ప్రాథమిక ఔషధాలూ నిండుకొంటున్నాయి. మాటలకు అందని మానవతా సంక్షోభమిది… మృగాల కంటే హీనంగా అకారణంగా అమాయకుల ఉసురుపోసుకుంటున్న బెంజమిన్ నెతన్యాహు నరహంతక నైచ్యమిది! వారి కోసం మనకు చేతనయినంత సహాయం చేద్దాం! వారి కోసం చేతులెత్తి ప్రార్థిద్దాం!!

జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు… అంటారు పెద్దలు. మానవ జీవితం నిత్యం సంఘర్షణలతో కలిసి ప్రయాణిస్తుంది. సాలెపురుగు గూడు కట్టడంలో ఎంతో నేర్పరితనం ప్రదర్శిస్తుంది. తను అల్లుకునే గూటిలో చిన్న దోషం కూడా రాకూడదు. ఎక్కడ తేడా వచ్చినా ఆ గూడు వదిలేసి, మరో గూడు కట్టుకోవటం మొదలుపెడుతుంది.
 ప్రతి ప్రాణి జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, అపాయాలు ఎదురవ్వటం సర్వసాధారణం. వాటిని ఎదుర్కోవటానికి నిరంతరం పోరాడుతూనే ఉండాలి. పోరాటానికి ధైర్యం అవసరం. ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండాలని మన ప్రవక్తల గాథలు, వీర జవానుల కథలు … మరెన్నో మనకు బోధిస్తున్నాయి.
విశ్వాసులారా! మీకు పూర్వం విశ్వాసులకు వచ్చిన (కష్టాల)న్నీ మీపై రాకముందే మీకు ఇట్టే స్వర్గప్రవేశం లభిస్తుందని భావిస్తున్నారా? ఆనాటి విశ్వాసులపై ఎన్నో కష్టాలు, కడగండ్లు విరుచుకుపడ్డాయి. వారు తీవ్రఆందోళన చెందారు. చివరికి అప్పటి దైవప్రవక్త, ఆయన సహచరులైన విశ్వాసులు (ఆ కష్టాలకు తట్టుకోలేక) “దైవసహాయం ఎప్పుడు వస్తుంది?” అని అరిచారు. అప్పుడు వారికి “ఇదిగో దైవసహాయం సమీపంలోనే ఉంది” (అని ధైర్యం చెప్పడం జరిగింది). (బఖరః – 214)
మానవ జీవితం కూడా సంఘర్షణలతో నిండి ఉంటుంది. నిరంతరం పోరాడుతూనే ఉండాలి. విజయం సాధించేవరకు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు.
ఒక చీమ తన కంటే మూడు రెట్లు బరువుని మోయగలదు. అలా మోసేటప్పుడు ఎన్నోసార్లు అది పడిపోతుంటుంది. కానీ, గమ్యం చేరేవరకు తన ప్రయత్నాన్ని విడిచిపెట్టదు. గాలికి ఎదురీదుతూ, లక్ష్యాన్ని చేరుకుంటుంది.
గిజిగాడు గూడు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. లోపల రెండు గదులుగా నిర్మిస్తుంది. గూటి నిర్మాణంలో ఏ చిన్న తేడా వచ్చినా, ఆ గూటిని విడిచిపెట్టి, వేరే గూటిని అల్లుతుంది. లోపం లేకుండా వచ్చేవరకు గూడు కట్టడానికి ఎక్కడా ధైర్యం కోల్పోదు. సృష్టిలోని ప్రతి ప్రాణీ తన లక్ష్యం సాధించుకునేవరకు ధైర్యంగా పోరాడుతూనే ఉంటుంది. కానీ, మానవుల విషయంలోనే అధైర్యం కనిపిస్తుంది. ధైర్యాన్ని కోల్పోయిన మరుక్షణం మనిషి అన్ని విషయాల్లోనూ అపజయం చవిచూస్తాడు. ఎందులో గెలవాలన్నా ధైర్యమే అసలైన ఆయుధం.
ఒక్క మాటలో చెప్పాలంటే –
(విశ్వాసులారా!) బాధపడకండి. అధైర్యంతో క్రుంగిపోకండి. మీరు నిజమైన విశ్వా సులైతే చివరికి మీరే విజయం సాధిస్తారు. (సత్యాసత్యాల సమరంలో) మీరేకాదు, వారు కూడా దెబ్బతిన్నారు. (ఆమాత్రానికే ధైర్యం కోల్పోవడమా!) ఇవన్నీ మేము ప్రజల మధ్య తిప్పే కాలపు మిట్టపల్లాలు మాత్రమే. ఆయన మీలో నిజమైన విశ్వాసులెవరో పరీక్షిం చడానికి, కొందరిని సత్యానికి సాక్షులు (అమరగతులు)గా చేయడానికి ఈవిధంగా చేశాడు. అల్లాహ్  దుర్మార్గుల్ని ఎన్నటికీ ప్రేమించడు. ఆయన ఇలాంటి పరీక్ష ద్వారా నిజమైన విశ్వాసులు ఎవరో ఏరివేసి, అవిశ్వాసుల్ని అణచి వేయదలిచాడు. (ఆల్ ఇమ్రాన్: 139-141)

పై పరిస్థితుల్ని ఆసరాగా చేసుకొని కొందరు బురద బుద్ధి ప్రబుద్ధులు నెక్స్ట్ మీరే అన్నట్టు ఎగాదిగా చూద్దాం మనం గమనిస్తాము. దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా విశ్వాసులు దుర్మార్గులకు కొమ్ము కాయరు. అదరఋ. బెదరరు. కావాలంటే బార చాచి నిలబడ్తారు .
“మీపై దాడి చేయడానికి అవిశ్వాసులు పెద్ద ఎత్తున సైన్యాలు సమీకరిస్తున్నారు, వారికి భయపడండి” అని జనం అన్నప్పుడు వారు ద్విగుణీకృత విశ్వాసంతో “మాకు అల్లాహే  చాలు, ఆయన గొప్ప కార్యసాధకుడు” అని సమాధానమిచ్చారు. చివరికి వారు అల్లాహ్ అనుగ్రహంతో, బహుమానాలతో తిరిగి వచ్చారు. వారికి ఎలాంటి నష్టం జరగలేదు. వారు అల్లాహ్  అభీష్టం ప్రకారం నడుచుకున్నారు. అల్లాహ్  (ఇలాంటివారికే) అపారంగా అనుగ్రహించేవాడు. (172-174)

చివరి మాట
నీళ్లకు బదులు నిప్పులు కురిసినా – ప్రమాద అగ్ని  పర్వతాలే పెల్లుబికినా  – శోక సముద్రాలే అలలెత్తినా  – మనం మాత్రం వెన్ను చూపక  ధైర్యంగా ముందుకు సాగాలి.  నరాలు తెగిపడి నెత్తురు  కారినా – నరమేధాలే  నేల నాలుగు చెరగులా కరాళ నృత్యంచేసినా  గాని -ధర్మం  కోసం ప్రాణం పోయినా – అద్ధం జీవితం. -అబద్దమాడకు- యుద్ధం జీవితం ఆధైర్యపడకు.

Related Post